టెక్నాలజీ నేరస్థులను పట్టుకోడానికి బాాగా ఉపయోగపడుతుంది. పోలీసులు చాలా సులువుగా నేరాలకు పాల్పడే వారిని పట్టుకుంటున్నారు. తాజాగా ఓ బిల్ కలెక్టర్ అలానే అడ్డంగా బుక్కయ్యాడు. లంచం ఇస్తే..ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ చేస్తానని చెప్పిన మల్కాజిగిరి జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ ఓ మహిళ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మనోడి బాగోతం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. జీహెచ్ఎంసీ పరిధిలోని మిర్జాలగూడలో ఓ మహిళ తన ఇంటిపై ఇంకో ఫ్లోర్ నిర్మిస్తోంది. అందుకు భారీగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని మల్కాజ్గిరి బిల్ కలెక్టర్ సయ్యద్ యాకుబ్ అల్తాఫ్ తెలిపాడు. తనకు కొంత డబ్బు ఇస్తే మేటర్ ఈజీగా అయిపోతుందంటూ ఓ కాస్ట్లీ సలహా కూడా ఇచ్చాడు. దీంతో మహిళ మొదట రూ. 25 వేలు క్యాష్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో..ఈ సారీ గూగుల్ పేలో డబ్బులు చెల్లిస్తానని చెప్పింది. పనిలో పనిగా ఏసీబీ దృష్టికి ఈ లంచగొండి వ్యవహరాన్ని తీసుకెళ్లింది. అల్తాఫ్ అడిగినట్టుగా ఈ శనివారం రూ. 14 వేలు గూగూల్ పే చేసింది సదరు మహిళ. అల్రెడీ సీన్ను మోనెటరింగ్ చేస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి బిల్ కలెక్టర్ను రాం నగర్లో అతని ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు.