భర్త అడుగు జాడల్లో నడవడం అనేది భారత స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం. తన భర్త ఆశయాలకు ముందుకు తీసుకువెళ్లేందుకు ఓ మహిళ పడ్డ కష్టం ఇప్పడు దేశాన్ని తలెత్తుకునేలా చేస్తుంది. భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్గా విధులు నిర్వహిస్తూ.. దేశానికి తన వంతుగ సేవలు అందించాలకున్నాడు. అయితే ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన మిరాజ్ 2000 విమానాన్ని పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆయన ప్రాణాలొదిలారు. విమానం రాడార్ పనితీరును తనిఖీ చేసేందుకు స్క్వాడ్రన్ లీడర్స్ సమీర్ అబ్రోల్(33), సిద్దార్థ్ నేగి(31) ఫిబ్రవరి 1న బయలుదేరగా ఆ విమానం ఎగిరే సమయంలో ప్రమాదం జరిగింది.
కలగా మిగిలిపోయిన అబ్రోల్ ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన భార్య గరిమా అబ్రోల్ కూడా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరి తన వంతు సేవల్ని అందించే దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) పరీక్షలను సాధించి ఐఏఎఫ్కు మార్గం సుగమం చేసుకున్నారు. గరిమా అబ్రోల్ హైదరాబాద్లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ప్రవేశం పొంది, ఆ తర్వాత 2020,జనవరిలో భారత వైమానిక దళంలో చేరనున్నారు. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమెను అసాధారణమైన మహిళగా అభివర్ణించారు.