మొన్ననే చిగురించిన బీజేపీ, జనసేన దోస్తీకి బ్రేక్ పడిందా? కలిసి ఉద్యమిస్తామని, ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తామన్న రెండు పార్టీల నాయకుల మాటలు కార్యరూపం ఎందుకు దాల్చడం లేదు? ఉమ్మడి కార్యాచరణ పక్కన పెట్టి రెండు పార్టీలు ఎవరి దారిలో వారు కార్యక్రమాల నిర్వహణకు సిద్దమవడం వెనుక కారణం ఏంటి? ఇదిప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.
జనవరి మూడోవారంలో బీజేపీ, జనసేన ఒక్కటయ్యాయి. రెండు మిత్రపక్షాలుగా కలిసి 2024 ఎన్నికలకు సిద్దమవుతామని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్లో సుదీర్ఘ మంతనాల తర్వాత రెండు పార్టీల మిత్రబంధంపై ఉమ్మడి ప్రకటన చేశారు. త్వరలోనే ఉమ్మడి కార్యచరణ ప్రకటిస్తామంటూ.. ఒకట్రెండు ఉమ్మడి సమావేశాలను కూడా నిర్వహించారు.
ఆ తర్వాత వారం, పది రోజులు గడిచిపోయాయి. ఇంతలో ఉమ్మడి కార్యాచరణ కాకుండా.. వేర్వేరు కార్యక్రమాల నిర్వహణపై ప్రకటనలు రావడం మొదలైంది. ఫిబ్రవరి 11, 12 తేదీలలో పవన్ కల్యాణ్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ తర్వాత అంటే ఫిబ్రవరి 15న మరోసారి పవన్ కల్యాణ్ ఒక్కరే ఏపీలో పర్యటనకు రెడీ అవుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహణకు రెడీ అవుతోంది.
ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తామన్న రెండు పార్టీలు ఇప్పుడు వేర్వేరుగా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఇదే ప్రశ్న జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్ని వారం రోజుల క్రితం టీవీ9 అడిగితే.. బీజేపీ నేతలంతా ఢిల్లీ ఎన్నికల్లో తెలుగువారి ఏరియాల్లో ప్రచారంతో బిజీగా వున్నారు.. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఏపీలో రెండు పార్టీలు ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఇపుడు ఢిల్లీ ప్రచారం ముగిసింది. పోలింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాతనే రెండు పార్టీలు ఉమ్మడి కార్యక్రమాలు కాకుండా వేర్వేరుగా కార్యక్రమాల నిర్వహణకు ప్రకటనలు చేశాయి.
బీజేపీ, జనసేన మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయా? లేక ఇంకా ఉమ్మడి కార్యాచరణ ఖరారు కాలేదా? ఒకవేళ ఖరారు కాకపోతే.. దానికి కారణమేంటి? ఇవిప్పుడు రెండు పార్టీల నేతల్లో, శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. దీనిపై స్పందిస్తుందా? లేక జనసేన క్లారిటీ ఇస్తుందా అన్నది వేచిచూడాలి.