ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అధిక శాతం ఫీడర్లలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాగే వచ్చే రబీ నాటి నుంచి 100 శాతం ఫీడర్లలో ఉచిత కరెంటు ఇవ్వాలని సీఎం మార్గనిర్దేశకాలు విడుదల చేశారు.
ఈ ఏడాది ఖరీఫ్ నుంచి 81 శాతం ఫీడర్లలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గత ఖరీఫ్లో 58 శాతం ఫీడర్లలో 9 గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ ఇచ్చామని… ఈసారి దీన్ని 81 శాతానికి పెంచుతున్నట్లు ఇంధన శాఖ అధికారులు సీఎం జగన్కు వివరించారు. విద్యుత్ రంగంపై సీఎం వైఎస్ జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్, జెన్కో ఛైర్మన్ సాయిప్రసాద్, సీఎం చీఫ్ అడ్వైజర్ అజేయ కల్లం పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల విద్యుత్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయని.. మిగిలిన 19 శాతం ఫీడర్లలో పనులు మందగించాయని అధికారులు వివరించారు. వచ్చే రబీ నాటికి అడ్డంకులన్నీ లేకుండా చేసి 100 శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటల పాటు ఫ్రీ కరెంటు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నామని తెలిపారు.