కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వరకు భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ ఆంక్షలు కొన్ని మనసును ద్రవింపజేసే ఘటనలను కళ్లకు కట్టేలా చేస్తున్నాయి. ఆంక్షల కారణంగా తండ్రి ఒక్కడే తన కొడుకు మృతదేహాన్ని చేతులపై శ్మశానానికి తరలించారు. ఈ హృదయ విదారక దృశ్యం అనంతపురం జిల్లా కదిరిలో కనిపించింది.
అనంతపురం జిల్లా కదిరికి చెందిన దంపతులు మనోహర్, రమణమ్మలు గోరంట్లలోని మాధవరాయ ఆలయం వెనుక ప్రాంతంలో ఒక చిన్న గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారు రోజంతా చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని అమ్మి బ్రతుకు సాగిస్తుంటారు. వారి పెద్ద కుమారుడు దేవా (11) గత శనివారం తీవ్ర అస్వస్థతకు గురవటంతో ఓ ప్రైవేటు డాక్టరు వద్ద చికిత్స చేయించారు. మెడిసిన్ కొనలేక.. ఆదివారం గోరంట్లలోని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హిందూపురం పంపించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసిన అనంతరం… బుధవారం అనంతపురం లేదా బెంగళూరు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. లాక్డౌన్ వల్ల వారు ఆ బిడ్డను ఎక్కడికీ తీసుకెళ్లలేకపోయారు. పరిస్థితి విషమించి బుధవారం బాలుడు కన్నుమూశాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చినా, అంత్యక్రియలకు డబ్బుల్లేక అష్టకష్టాలు పడ్డారు. దీంతో తండ్రి తన బిడ్డను రెండు చేతుల్లో మోసుకుంటూ స్మశాన వాటికకు తీసుకెళ్లి ఖననం చేశాడు.