దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వరద కల్లోలంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. దక్షిణ, పశ్చిమ భారతంలో నీటి ఉద్ధృతితో జనజీవనం అతలాకుతలమవుతోంది. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళలలో ఇంకా వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది.కర్నాటకలో దాదాపు అన్ని నదులు వరద తాకిడికి ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు దాదాపు 183 మంది మృత్యువాతపడ్డారు. కేరళలోని మళప్పురం జిల్లాలో కొండచరియ విరిగిపడిన ఘటనలో 65 మంది సజీవసమాధి అయినట్టుగా అనుమానిస్తున్నారు.
మరోవైపు కూడా గుజరాత్లో వరద మృతుల సంఖ్య 31 దాటింది. కర్ణాటకలో అన్ని నదులు పొంగిపొర్లుతుండటంతో ఆదివారం ఉదయం ఒక రిజర్వాయర్ నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనివల్ల హంపీ మునిగిపోయింది. ఇప్పటికే వరద ప్రభావ ప్రాంతాలైన కర్నాటక, మహారాష్టల్ల్రో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
ఇదిలా ఉంటే ఏపీలో, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వరద ప్రభావం తీవ్రంగానే ఉంది. గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం తగ్గడంతో దవళేశ్వరం ఆనకట్టవద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరోవైపు లంక గ్రామాలు, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు వరద నీటితో నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో 10 గేట్లు ఎత్తి 7.50 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. అదే విధంగా తుంగభద్ర గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.