డ్రగ్స్ మాఫియాకి పోలీసులు ఎన్ని రకాలుగా చెక్ పెట్టినా.. వారు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పటికే న్యూయర్ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా.. కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయినా.. ఇంకా పలు పార్టీల్లో, ఈవెంట్స్లలో డ్రగ్స్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఈ డ్రగ్స్ దందా కీలకంగా నడుస్తోంది.
కాగా.. న్యూయర్ సంద్భంగా పోలీసులు యువతకి పలు ఆంక్షలు విధించారు. అలాగే పార్టీలు, ఈవెంట్స్ జరిగే ప్రదేశాలను ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈసారి జరిగే వేడుకల్లో మహిళల సింగిల్స్కి ఎంట్రీ లేదని చెప్పేశారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనాలని పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరిగే అన్ని ప్రదేశాల వివరాలు తమకు ఇవ్వాలని, సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని వారు పేర్కొన్నారు. డిసెంబర్ 31 అర్థరాత్రి 11 గంటల వరకే న్యూయర్ సెలబ్రేషన్స్కి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 11 గంటలు దాటితే.. పబ్లను సీజ్ చేస్తామని, నిర్వాహకులను, కస్టమర్లను అరెస్ట్ చేస్తామని, వారిని తప్పకుండా కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు హెచ్చరించారు.
పలు మార్గాల ద్వారా డ్రగ్స్ని తరలించే వీలు ఉంది కాబట్టి.. శంషాబాద్ ఎయిర్పోర్టుల్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చెన్నై, కర్ణాటక నుంచి వస్తోన్న ప్రయాణికులకు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఇటీవలే జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ సారి న్యూయర్ వేడుకలపై ఆంక్షలు విధించనున్నారని సమాచారం.