డాక్టర్ సుధాకర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈపేరు మారుమోగిపోతుంది. ప్రభుత్వ డాక్టర్ అయిన ఈయన ఎన్-95 మాస్కుల కొరతపై ప్రశ్నించడం..ఆ తర్వాత ప్రభుత్వం అతడివి తప్పుడు అభియోగాలు చెప్తూ వేటు వేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత కొంతకాలం కనిపించని ఆయన.. ఈ నెల 16న విశాఖలో ప్రత్యక్షమయ్యారు. మద్యం మత్తులో రోడ్డుపై రభస సృష్టిస్తున్నాడన్న ఆరోపణలతో ఆరోజు ఆయన్ను అరెస్టు చేశారు పోలీసులు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ ను చికిత్స నిమిత్తం విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
తాజాగా ఆయన మాస్కుల వివాదం నుంచి తనకు మెంటల్ ఆస్పత్రిలో ఇస్తున్న మెడిసిన్ వరకు అన్ని విషయాలను కూలంకషంగా వివరిస్తూ.. విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్కు లేఖ రాశారు. నార్మాల్ గానే ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆరోపించారు. తనకు ఏ రోజు ఏ మెడిసిన్ ఇచ్చారో లేఖలో వివరించారు. ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని లేఖలో వెల్లడించారు. పెదవిపై వచ్చిన మార్పులు కనిపించేవిధంగా ఫొటోలను డాక్టర్ సుధాకర్ రిలీజ్ చేశారు. తనను వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి బాగానే ఉందని లేఖలో సుధాకర్ వెల్లడించారు.