తిరుమల ఆనందనిలయంలో శ్రీనివాసుని ప్రధాన అర్చకుని పోస్టు ఆశించిన రమణ దీక్షితులుకు కేవలం ఆగమ శాస్త్ర సలహాదారు పోస్టు ఇవ్వడంతో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనే అంశంపై ఏర్పడిన సందిగ్ధతకు ఆయనే స్వయంగా తెరదించారు. నిజానికి మంగళవారం రాత్రి మొదలైన రకరకాల కథనాలను రమణ దీక్షితులు బుధవారం పీక్ లెవల్కు తీసుకెళ్ళారు. బుధవారం పొద్దటి నుంచి తన అనుకూల వ్యక్తులతో రోజంగా సమాలోచనలు జరిపిన దీక్షితులు.. చివరికి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
శ్రీవారికి అనాది కాలంగా నాలుగు కుటుంబాల అర్చకులు ఆటంకం లేకుండా పూజలు నిర్వహిస్తున్నామని, 1987 లో ఒక చట్టంతో వంశపారంపర్య అర్చకత్వం రద్దు కావడంతో దాంతో వేలాది మంది అర్చక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన మీడియాకు వివరించారు. 2004 చట్టంలో సవరణలు చేసి వంశపారంపర్య హక్కులను అర్చకులకు కల్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని దీక్షితులు చెప్పుకొచ్చారు.
ఆగమశాస్త్రంలో కానీ, చట్టంలో కానీ అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితిని నిబంధనేది లేనే లేదని, చంద్రబాబు ప్రభుత్వం కక్షాపూరితంగా వ్యవహరించి కొత్త చట్టాన్ని సృష్టించి, వంశపారంపర్యంగా శ్రీవారి ఆలయంలో సేవ చేస్తున్న అర్చకులను బలవంతంగా రిటైర్డ్ చేశారని ఆయన వివరించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అర్చకులకు పదవీవిరమణ రద్దు చేసి మాట నిలబెట్టుకున్నారని, పదవీవిరమణ చట్టం రద్దు చేశారని అన్నారు.
టీటీడీ ఆగమ సలహాదారుడిగా తనను నియమించడంతో పాటు మరో వారంరోజుల్లో ప్రధాన అర్చకుడు హోదా కల్పిస్తారని సీఎం హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తనతో పాటు మిగతా వంశపారంపర్య అర్చకులకు యధాస్థానం తిరిగి కేటాయిస్తామని టీటీడీ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఆగమ సలహామండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించానని ఆయన చెప్పారు.
బ్రహ్మా ణులు, అర్చకుల సంక్షేమార్థం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు హర్షనీయమని, సీఎం జగన్ సుపరిపాలనకు ఫలితంగా రాష్ట్రంలో ఎన్నడూ నిండని జలాశయాలు కూడా ఇప్పుడు నిండుకుండలను తలపిస్తున్నాయని దీక్షితులు అన్నారు. మరో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నామని రమణ దీక్షితులు తెలిపారు.