ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్..ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. రివర్స్ టెండరింగ్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం ఇటీవలే దిశ చట్టాన్ని తీసుకువచ్చి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించారు.
మహిళలపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి, కేసులు నమోదు తర్వాత త్వరితగతిన విచారణ జరిగేలా, శిక్షలు పడేలా ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని ప్రవేశపెట్టింది. నిందితులపై నేరారోపణకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో 14 రోజుల్లోనే విచారణను ముగించి 21 రోజుల్లోనే..జీవితఖైదు లేదా మరణ శిక్ష విధించనున్నారు.
మహిళల భద్రతకు భరోసా ఇస్తోన్న ఇటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలన్న డిమాండ్ ఉపందుకుంటోంది. దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ గత పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానికి లేఖ రాశారు. మహిళలపై జరుగుతోన్న దాడులు పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆమె తప్పుబట్టారు. దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకొచ్చేవరకు నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా స్వాతి మాలివాల్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.