DCGI Key Announcement: కరోనా వైరస్తో అల్లాడుతున్న దేశ ప్రజలకు ఊపిరి పీల్చుకునే శుభవార్త వచ్చేసింది. మహమ్మారి వైరస్ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. తాజాగా దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కీలక ప్రకటన చేసింది. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తొలి రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయన్న డీసీజీఐ డైరెక్టర్.. రెండు డోసులుగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉంచాలన్నారు. ఇక డీసీజీఐ అనుమతి లభించడంతో కేంద్రం వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జైడస్ సంస్థ మూడో విడత క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతి ఇచ్చింది. కాగా, ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగం కోసం సిఫారసులు చేసిన 24 గంటల్లోపే..కొవాగ్జిన్కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ రెండు వ్యాక్సిన్స్కు డీసీజీఐ పచ్చజెండా ఊపింది.