తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. జయశ్ రంజన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిల నామినేషన్లను తిరస్కరణ గురవ్వడంతో రంగారావు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారా? అసలు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికపై ఇంత వివాదమెందుకు? పొలిటికల్ పార్టీలు కలుగజేసుకోవడమే ఇందుకు కారణమా? ఇవిప్పుడు తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల సరళిని చూస్తే ఒక అసోసియేన్ ఎన్నిక ఏకంగా సార్వత్రిక ఎన్నికల స్థాయిని తలపిస్తుంది. బరిలో ముగ్గురు ఉండగా.. ఇద్దరి నామినేషన్లు రిజక్ట్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నిక లేకుండానే అధ్యక్ష పదవి ఏకగ్రీవం అవుతుందా? కోర్టుల జోక్యంతో సీన్ మారుతుందా? అనే ఉత్కంఠ క్రీడా సంఘాల్లో ఆసక్తి రేపుతోంది.
రోజుకో తరహా ట్విస్టులతో నాలుగేళ్లకోసారి జరిగే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి హాట్ హాట్గా మారాయి. ఎన్నిక సమయం దగ్గర పడే కొద్దీ పరిస్థితులు తారుమారు అవుతూ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. అసోసియేషన్ లో ఎన్నికలు.. దాని వెనుక ఉన్న రాజకీయాలను ఒకసారి దగ్గరగా పరిశీలిస్తే.. అధ్యక్షుడిగా తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఎన్నిక లాంఛనమే అనుకున్నారంతా. అయితే అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి నుంచి గట్టిపోటీ ఉంటుందని అంచనా వేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) నుంచి అనుమతి రాని కారణంగా జయేశ్ నామినేషన్, అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేస్తున్న రంగారావుకి జితేందర్ రెడ్డి ప్రపోజల్ చేసి సంతకం పెట్టాడని.. సంతకం పెట్టిన వ్యక్తే అదే ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసే హక్కు లేదంటూ జితేందర్ రెడ్డి నామినేషన్ తిరస్కరించారు. దీంతో సీన్ మారిపోయింది.
దీంతో ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల బరిలో ఉన్నది కేవలం రంగారావు మాత్రమే. నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయింది. పోటీలో ఎవరు లేకపోవడంతో.. అధ్యక్ష స్థానం రంగారావు కైవసం అయినట్లే అనుకున్నారు. కానీ.. అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నామినేషన్ల తిరస్కరణ అక్రమం అంటూ కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది జయేష్ రంజన్ ప్యానెల్.
అంతా వివాదమే. అన్నీ అవకతవకలే!
ఓ వైవు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పీటంపై కూర్చునే ఆశావహులు తమ నామినేషన్ ఎలాగైనా.. ఆక్సెప్ట్ చేయించుకోవాలని తాపత్రయపడుతుంటే.. అసలు రిటర్నింగ్ అధికారి నియామకం చెల్లదని అంటున్నారు రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహనరావు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కొందరు వ్యక్తులు రాజకీయ కుట్రలకు తెరలేపారని మండిపడుతున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జస్టిస్ బి.చంద్రకుమార్ నియామకం చెల్లదన్నది జగన్ మోహన్ వాదన.
హైదరాబాద్ను క్రీడలకు హబ్గా మార్చాలనే విజన్తో ఉన్న నిజాయితీ గల ఐఎఎస్ అధికారిని తప్పించడానికి పథకం ప్రకారం కొందరు ప్లాన్ చేశారన్నది జగన్మోహన్ ఆవేదన. ఒలింపిక్ అసోసియేషన్ను బాగు చేద్దామన్నా.. కొందరి గిట్టడం లేదని ఆయన అంటున్నారు. ఎన్నికల సిబ్బంది పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న క్రీడాకారులు మండిపడుతున్నారు. జయేష్ నామినేషన్ ఏ కారణంగా తిరస్కరించారో అడుగుతుంటే చంద్రకుమార్ దగ్గర సమాధానం లేదని అంటున్నారు.
రిటర్నింగ్ అధికారి నియామకం విషయానికి వస్తే.. వాస్తవానికి నవంబర్ 19న రిటర్నింగ్ అధికారిగా జస్టిస్ కేసీ భాను, ఏఆర్వోగా ఐఎఎస్ అధికారి వెంకటేశ్వర్ రావును ఎంపిక చేసినట్లు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్కు లేఖ పంపారు. వారి పేర్లను ఆమోదిస్తూ ఐఓఏ ధ్రువీకరించింది. ఐఓఏ అనుబంధ జాతీయ క్రీడా సంఘాలు, రాష్ట్రంలో ఉన్న క్రీడా సంఘాల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారికి సూచనలు అందాయి. అయితే 33 జిల్లాలకు స్థానిక ఒలింపిక్ సంఘాల నిర్మాణం జరగలేదు. దీంతో రాష్ట్ర క్రీడా సంఘాలనే ఓటర్లగా పరిగణనలోకి తీసుకోవాలని ఐఓఏ సూచించింది. దీనికి తోడు డిసెంబర్ 23న 30 సంఘాలతో కూడిన ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి కేసీ భానుకు పంపింది. అయితే.. దీనిని పక్కన పెట్టిన జగదీశ్వర్ యాదవ్ 10 జిల్లాలకు, అనైతికంగా మరో రెండు రాష్ట్ర సంఘాలకు ఓటు హక్కు కల్పించి ఓటరు జాబితా సిద్ధం చేశారని జగన్మోహనరావు ఆరోపిస్తున్నారు.
ఇదంత ఒక ఎత్తైతే.. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఢిల్లీలో జరగడం ఏంటన్నది మరో వివాదం. ఎన్నికపై విచారణ చేపట్టిన కోర్టు.. హైదరాబాద్లోనే ఎన్నిక నిర్వహించాలని సూచించింది. హైదరాబాద్లో ఎన్నికలు జరపాలని జయేష్ రంజన్ ప్యానల్ కోర్టు తలుపు తట్టడంతో అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారి నియామకం, జయేష్ నామినేషన్ తిరస్కరణ వంటి విషయాలపై కోర్టులో సవాల్ చేస్తామంటోంది జయేష్ వర్గం. హైదరాబాద్లో ఎన్నిక జరిపించాలన్న కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటున్నారు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్. ఓటర్ లిస్ట్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్న జగదీశ్వర్.. రిటర్నింగ్ అధికారిగా చంద్ర కుమార్ ఎన్నిక కరెక్ట్ గానే జరిగిందని అంటున్నారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన కారణంగానే చంద్రకుమార్ ఎన్నికను తప్పు పడుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య ఫిబ్రవరి 9న ఏం జరగబోతుందన్న ఆసక్తి క్రీడావర్గాల్లో నెలకొంది.