ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో కరోనావైరస్ దెబ్బకు డైమండ్ మార్కెట్ కుదేలయింది. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా రాజధాని గాబొరోన్లోని గనుల్లో అయితే వజ్రాలు కుప్పలుతెప్పలుగా పడున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల గనులున్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ప్రసిద్ధ మైనింగ్ కంపెనీ ‘డీ బీర్స్’ ఇక్కడ మైనింగ్ చేస్తోంది. అయితే ఫిబ్రవరి నుంచి ఒక్క వజ్రం కూడా అమ్మలేకపోయింది. ఇక ‘డీ బీర్స్’కు పోటీ మైనింగ్ సంస్థ ‘అల్రోసా పీజేఎస్సీ’ది కూడా అదే పరిస్థితి. ఇది రష్యా కంపెనీ.
కోవిద్-19 వజ్రాల ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. నగల దుకాణాల తలుపులు మూసుకున్నాయి. ‘డీ బీర్స్’ అయితే మార్చి మాసంలో అమ్మకాలను రద్దు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోవడంతో సరుకు చూసేందుకు బయ్యర్లు రావడం లేదు. మరోవైపు ధర తగ్గించేందుకు మైనర్లు సిద్ధంగా లేరు. దీంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. ‘డీ బీర్స్’తో పాటు ‘అల్రోసా’ కూడా నష్ట నివారణ చర్యలకు దిగాయి. స్టాక్ను తగ్గించుకొనేందుకు ప్రొడక్షన్ను భారీగా తగ్గించాయి. అదే సమయంలో తమ మార్కెట్ను చేజారకుండా చూసుకొనే పనిలో పడ్డాయి.