CM KCR Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న పలు శాఖల్లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, వైద్య ఆరోగ్య, అటవీ తదితర శాఖల ముఖ్యమైన అంశాలపై కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ప్రగతి భవన్లో కేసీఆర్ సీనియర్ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో రెవెన్యూ శాఖలో పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇక సోమవారం జరిగే సమావేశంలో పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనమాల క్రమబద్దీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్-బీలోని భూముల పరిష్కారం తదితర అంశాలను కేసీఆర్ చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేసీఆర్ చర్చించనున్నారు. కరోనా వ్యాక్సిన్ను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యత ఉన్న వారిని గుర్తించడంపై సమీక్షిస్తారు.