భారతీయ జీవిన, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగమే అత్యంత కీలకమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వ్యవసాయం లాభదాయకమైనది కాదనే దృక్పథంలో మార్పురావాలని అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలని కోరుకున్నారు.
నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి దేశం ఎదగాలన్నారు. పరిశ్రమలకు కీలకమైన ముడి సరకును వ్యవసాయ రంగమే అందిస్తోందని గుర్తు చేశారు. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ మనది కాబట్టే ఆటుపోట్లను తట్టుకుంటోందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం, నాబార్డు వంటి సంస్థలు ప్రణాళిక అమలు చేయాలి అని సూచించారు.
దేశంలో 135 కోట్ల మందికి అన్నంపెట్టేది వ్యవసాయదారులే అని అన్నారు. మన దేశం నుంచి ధాన్యం ఎగుమతి చేసే విధానం రావాలన్నారు. ఎగుమతి చేసే విధానంపై నాబార్డు అధ్యయనం చేయాలని సూచించారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని… పంటల మార్పిడి విధానం పాటించాలని పేర్కొన్నారు. పంటలు పండించే విధానంతో పాటు మార్కెటింగ్ విధానం ఉండాలని… దేశంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.