ప్రజల సమస్యలతో, వారి ఇబ్బందులతో పని లేకుండా ఆర్టీసీ యూనియన్లు చేస్తున్న సమ్మె వల్ల జనం పాట్లు పడకుండా తెలంగాణ సర్కార్ పక్కా చర్యలకు ఉపక్రమించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు అందరూ సమన్వయంగా పని చేస్తూ ప్రజా రవాణాను మరింత పెంచే దిశలో కృషి చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రవాణా సదుపాయాల మెరుగుకై తమవంతుగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా ప్రయత్నం చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు నడిచిన బస్సుల సంఖ్యను గమనించినట్లయితే 1928 అద్దె బస్సులను కలుపుకుని మొత్తం 6519 బస్సులను తిప్పగలిగారు. 11వేలకు పైగా తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లు విధులు నిర్వర్తించగా, 4320 బస్సుల్లో టిమ్స్ ద్వారా, 1402 బస్సుల్లో నేరుగా టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగింది. కాగా, నిర్దేశించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయడం, విధిగా టిక్కెట్లు ఇచ్చేలా చర్యలు చేపట్టే విషయాలపై అధికార యంత్రాగం తగిన చర్యలు తీసుకుంటోంది.
ఈ విషయంపై డిపో నుంచి బస్సు బయలు దేరే ముందు తాత్కాలిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంస్థ జారీ చేసే బస్ పాసులను తప్పని సరిగా అనుమతించాలని చెబుతూ వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐ.ఎ.ఎస్లు ప్రజా రవాణా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి గానూ అవకాశాలన్నింటిపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకు రవాణా లోటు కనబడకుండా చూడాలని, అవసరమైన మేరకు బస్సు సర్వీసుల్ని తిప్పి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.