Chandrababu writes Modi on lock down decision టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్పై చంద్రబాబు స్పందించారు. కోవిడ్-19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి చంద్రబాబు మోదీని అభినందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన చంద్రబాబు.. కరోనాను అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కూడా ఆదుకోవాలని చంద్రబాబు ప్రధానిని కోరారు.
లాక్ డౌన్ కారణంగా రైతులు, కార్మికులు, రోజువారీ కూలీలు ఆర్ధికంగా నష్ట పోయారని, ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన నగదును కూడా రైతులకు ముందే ఇవ్వడం అభినందనీయమన్నారు. కేంద్ర సూచిస్తున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.