ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కరువుతో అల్లాడిపోతున్న పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీలకు సంబంధించిన రూ.765.85 కోట్ల నిధులను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. కూలీలకు నగదు చెల్లింపుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు.
ఉపాధి హామీ స్కీమ్ కింద.. గతంలో రిలీజ్ చేసిన 2 వేల 148 కోట్ల నిధులు… జూన్ 2, 2020 వరకు పనులు చేసిన కూలీల పేమెంట్లకు సరిపోయాయని.. ప్రస్తుతం రిలీజ్ చేసిన రూ.765.85 కోట్ల రూపాయలు తాజా సీజన్లో పని చేసిన కూలీల చెల్లింపులకు సరిపోతాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతోన్న ఉపాధి హామీ కూలీలకు ఇది ఎంతో ఊరటనివిచ్చే విషయమన్నారు మంత్రి. మహమ్మారి వైరస్ పై కూలీలకు అవగాహన కార్య క్రమాలు ఏర్పాటు చేస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ..మాస్క్ ధరించేలా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. నిధులు వెంటవెంటనే రిలీజ్ అవుతున్నందున.. కూలీలకు ఎటువంటి ఆటంకం లేకుండా పనులు ఉండేలా చూడాలని అధికారులను పెద్దిరెడ్డి ఆదేశించారు.