ఓ వైపు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తెల్లరేషన్ కార్డు దారులు భూములు కొన్న వ్యవహారం సంచలనం రేపుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీకి ఫిర్యాదు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. తమను బెదిరింది భూమిని లాక్కున్నారంటూ బుజ్జమ్మ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది సీఐడీ.
గుంటూరు జిల్లా వెంకటపాలెంకు చెందిన బుజ్జమ్మకు 90 సెంట్ల అసైండ్ భూమి ఉంది. దాన్ని మాజీ మంత్రులు లాక్కున్నారని ఆమె సీఐడీకి ఫిర్యాదు చేసింది. బుజ్జమ్మ ఫిర్యాదు ఆధారంగా.. మాజీ మంత్రులపై సెక్షన్ 420 506, 120/బి కింద సీఐడీ కేసులు పెట్టింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిచారు ప్రత్తిపాటి పుల్లారావు. అవి పూర్తిగా అవాస్తవాలని.. కావాలనే మాపై ఈ రకంగా బురద జల్లాలని చూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.