హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె. లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాయలంలో గురువారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయ్యిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ముఖ్యనాయకులు పాల్గొన్నారని, వారందరికీ తన ధన్యావాదాలన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైందని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా గల్లంతు కానుందని, కాంగ్రెస్ కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాము అనుకున్న వాటి కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చనున్నాయని విమర్శించారు. వచ్చే నెల 23 తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు.