BJP State president Bandi Sanjay fires on CM KCR: సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై కమలం నేతలు నిప్పులు గక్కుతున్నారు. సీఏఏను వ్యతిరేకించడమంటే దేశద్రోహమేనని వారు మండిపడుతున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ కేసీఆర్ ప్రసంగించడం దేశద్రోహమేనని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన కామెంట్లపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ న్యూ ఢిల్లీలో స్పందించారు. ఘాటైన పదజాలంతో వారిద్దరు కేసీఆర్ వినియోగించిన భాషపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిందేనని వారు కుండబద్దలు కొట్టారు.
పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, పొరుగు దేశాల్లో మత హింసకు గురైన మైనారిటీలు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులకు పౌరసత్వం ఇవ్వద్దని కెసిఆర్ అంటున్నారా? అని బీజేపీ ఎంపీలు ప్రశ్నించారు. ఎన్పీఆర్ వ్యతిరేకించే కెసిఆర్.. తెలంగాణలో సమగ్ర సర్వే ఎందుకు నిర్వహించారు? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం చెత్త కాగితంతో సమానమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కెసిఆర్ బర్త్ సర్టిఫికెట్ విజయనగరం ఆర్డీవోకి దరఖాస్తు చేసుకుంటే ఇస్తారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తమకు గడీలు ఉండేవని చెప్పుకునే కేసీయార్కు తన పుట్టిన వివరాలు తెలియవా అని ప్రశ్నించారు అరవింద్. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినంత మాత్రాన పౌరసత్వ సవరణ చట్టం అమలు కాకుండా పోదని ఆయన అన్నారు. ఎవరైనా విధిగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే రేపు ఓటు హక్కు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన వార్నింగిచ్చారు. బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసీఆర్ చేసిన కామెంట్లను అరవింద్ ఖండించారు. రాజాసింగ్ అసలు సిసలు భారతీయుడని వ్యాఖ్యానించారు.