BJP implementing double strategy: సిటిజెన్స్ అమెండ్మెంట్ యాక్టు (సీఏఏ)కు మద్దతుగా మార్చి 15న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకోసం కమలదళం ఏర్పాట్లను ప్రారంభించింది. ఓవైపు సభ ఏర్పాట్లను భారీ ఎత్తున చేస్తూనే ఇంకోవైపు సభకు అనుకూలంగా వాతావరణం కలిగించేలా ద్విముఖ వ్యూహాన్ని అమలు పరచాలని బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఎల్బీ స్టేడియం సభలో అమిత్ షాతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ని కూడా ఆహ్వానించాలని భావిస్తున్న కమలదళం.. సీఏఏ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు, జాతీయతా భావాన్ని వ్యాప్తి చేసేందుకు అన్ని మార్గాలను అనుసరించేందుకు రెడీ అవుతోంది.
సీఏఏ అనుకూల సభ ఏర్పాట్లను సమీక్షించేందుకు సోమవారం బీజేపీ తెలంగాణ ఇంఛార్జి అనిల్ జైన్ హైదరాబాద్ వచ్చారు. అనిల్ జైన్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. అమిత్ షా, పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో జనసమీకరణ, ఏర్పాట్లపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. దేశద్రోహులకు అండగా నిలుస్తున్న ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మోసాలను ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే ద్విముఖ వ్యూహాన్ని ఖరారు చేశారు.
సీఏఏ ఉద్దేశాన్ని ప్రజల్లో ప్రచారం చేయాడం ఒక వ్యూహమైతే.. సీఏఏని వ్యతిరేకిస్తున్న పార్టీల నిజస్వరూపాన్ని ఎండగట్టడం రెండోది. అందులో భాగంగా.. బీజేపీ నేతల బృందం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసింది. హైదరాబాద్లో సెటిలైన రోహింగ్యాల వెనుక ఎంఐఎం పార్టీ హస్తముందని, 127 మంది దొంగ పత్రాలతో ఆధార్ కార్డులు పొందడం వెనుక భారీ కుట్ర వుందంటూ బీజేపీ నేతలు సేకరించిన కొన్ని సాక్ష్యాలను డీజీపీకి అంద చేశారు.
దొంగ పత్రాలతో ఆధార్ కార్డులు పొందిన 127 మందిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు డీజీపీని కోరారు. దొంగపత్రాతో ఆధార్ కార్డులు పొందిన వారికి ఎంఐఎం మద్దతు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని వారు ప్రశ్నించారు. దేశ హితం కోసం ప్రధాని మోదీ సీఏఏ; ఎన్పీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. అక్రమ పత్రాలు కలిగిన ఉన్న వారి డేటాను డీజీపీకి అందించామని, సీఏఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు నేరుగా పోలీసులకే సవాల్ విసురుతున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు.
ప్రతీ చిన్ని అంశానికి ట్విట్ఱర్లో స్పందించే ఓవైసీ సోదరులు 127 మంది దొంగ పత్రాలతో ఆధార్ కార్డులు పొందితే ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. సీఏఏకు మద్దతుగా మార్చ్ 15న నిర్వహించే అమిత్ షా సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరై ఒవైసీ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒకవైపు జనసమీకరణపై దృష్టి సారిస్తూనే.. జాతీయతపై ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే దిశగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు.
Read this: KCR super plan on Pattanapragathi పట్టణ ప్రగతిపై కేసీఆర్ వ్యూహం