కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
కాగా.. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పలు కీలక పదవులను చేపట్టారు. 1991 నుంచి బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు జైట్లీ. 1998లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధి బృందానికి జైట్లీ సారథ్యం వహించారు. అప్పుడు కేంద్రంలో వాజ్పేయి నాయకత్వాన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఆ సమావేశంలోనే డ్రగ్స్, మనీ లాండరింగ్పై ఐరాసలో చట్టం చేశారు. 1999లో ఏర్పడిన వాజ్పేయ్ ప్రభుత్వంలో సమాచారశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ యుగం మొదలయ్యాక దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పర్వం ప్రారంభమైంది. అప్పుడు దీని కోసం వాజ్పేయ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖను జైట్లీకి అప్పగించారు.
యూపీఏ ప్రభుత్వ కాలంలో తిరిగి బీజేపీ ప్రధానకార్యదర్శిగాను…రాజ్యసభలో ప్రతిపక్ష నేతగానూ బాధ్యతలు నిర్వహించారు. 2009 జూన్ వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత బాధ్యతల్ని అద్వానీ నిర్వహించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించిన తర్వాత లాయర్గా తన ప్రాక్టీస్ను నిలిపివేశారాయన. పంజాబ్కు చెందిన అరుణ్జైట్లీ 2014 వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. 2014లో అమృతసర్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటికే గుజరాత్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న జైట్లీని 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించింది బీజేపీ నాయకత్వం. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జైట్లీ ఆసియన్ డవలప్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కూడా సేవలందించారు.