ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య విషయంలో రోజుకో కొత్త ట్విస్టు వెలుగులోకి వస్తుంది శివప్రసాదరావు మృతికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది హత్య అంటూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడెల మరణంపై సీబీఐ విచారణ జరపాలని అనిల్ బూరగడ్డ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. కోడెల శివప్రసాద్ను ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ హత్య చేసి ఉంటారని అనిల్ ఆరోపించారు. ఇటీవల కోడెల కుటుంబంపై వరుసగా కేసులు నమోదు కావడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు తండ్రిని హత్య చేసి ఉంటారని అనిల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లో సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.
కాగా కోడెల మేనల్లుడు సాయి బాబు కూడా ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొడుకు శివరామే కోడెల హత్య చేయించి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.