ఎక్కువగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఆర్థిక లోటు ఉండటంతో ఏపీ సర్కార్ మొదట్నుంచి అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ కు వ్యతిరేకంగా తన వాణిని వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు కల్పించడంతో..ఏపీ సర్కార్ కూలంకషంగా చర్చించిన అనంతరం ..కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అయితే ఆ ప్రాంతాలలో కూడా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టు పనులు, భవన నిర్మాణాలకు.. ఐటీ సంస్థల్లో 50శాతం ఉద్యోగులతో పనులకు, అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. వాహనాల మరమ్మతు కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన దాబాలను నిబంధనల మేరకు నిర్వహించుకోవచ్చు. 30 నుంచి 40శాతం రవాణా సామర్థ్యంతో వాహనాల్లోనే ఉద్యోగులను తరలించాలని చెప్పింది ప్రభుత్వం. అయితే ఆయా సంస్థలన్నీ వారి ప్రాథమిక సమాచారంతో నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులను కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమలశాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు పంపింది ప్రభుత్వం.