Aleru MLA Gongidi Suneetha Tested Postiive: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజాగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.
కోవిద్-19 పాజిటివ్ అని తేలడంతో ఆమె స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కరోనా ప్రారంభ దశలోనే ఉందని, వైద్యం కొనసాగుతోందని చెప్పారు. ‘‘లక్ష్మీనరసింహ స్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో త్వరలోనే కోలుకుని మీ ముందుకు ఆరోగ్యంతో వస్తాను’’ అని సునీత తెలిపారు.