వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ఎప్పుడూ మతపరమైన విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అక్బరుద్దీన్.. తాజాగా వెలువడిన అయోధ్య తీర్పు అంశంపై స్పందించారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చేసిన వారందరినీ అరెస్ట్ చెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కూల్చిన వారదంరినీ వెంటనే జైళ్లలో వేయాలన్నారు.
మసీదుకు మరోచోట స్థలం కేటాయించడం ఆమోదయోగ్యం కాదని.. మసీదు కూల్చివేత ఘటనపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయోధ్య స్థల వివాదం అంశంపై సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు అక్బరుద్దీన్ ఒవైసి. అంతేకాదు.. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 6న శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని తన వర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.