బీజేపీతో చేతులు కలిపినందుకు అజిత్ పవార్ క్షమాపణ చెప్పారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. తమ పార్టీలో అజిత్ ఇక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. అటు-‘ అజిత్ ఘర్ వాపసీ ‘ పట్ల ఈ పార్టీ వర్గాలు హర్షం ప్రకటించాయి. తాను ఎన్సీపీలోనే ఉంటానని, దీనితోనే కొనసాగుతానని మళ్ళీ మళ్ళీ ప్రకటించడం అజిత్ ‘ చిత్త శుద్దికి ‘ నిదర్శనమని పేర్కొన్నాయి. కాగా-సుప్రీంకోర్టు తీర్పు తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నానని, డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశానని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక తన ప్రయాణం ఎన్సీపీతోనే అన్నారు. మరోవైపు.. గురువారం శివాజీ పార్క్ లో శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఉధ్ధవ్ తో బాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్ఛునని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చునని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీని, బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షాను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని సేన వర్గాలు తెలిపాయి.