ఈనెల 14 నుంచి మొదలు కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కరోనా పరీక్షలు తప్పనిసరి కావడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోనున్న భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉభయ సభలకు చెందిన సభ్యలు తప్పనిసరిగా తమ కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. సభా సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు సభ్యులు కొవిడ్ టెస్టుకు సంబంధించిన రిపోర్టులను అందజేయాల్సి ఉంటుందిం. ప్రభుత్వం ఆమోదించిన ఆస్పత్రులు, లాబోరేటరీలు, పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టు సమర్పించాలి. రిపోర్టును ఈ మెయిల్ ద్వారా రాజ్యసభ సెక్రటేరియట్కు పంపించాల్సి ఉంటుంది.
అయితే, సభ్యుల సౌకర్యార్థం పార్లమెంట్ భవనం ప్రాంగణంలో మూడు కోవిడ్ టెస్ట్ సెంటర్లను సిబ్బంది ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో భాగంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు శుక్రవారం కొవిడ్ పరీక్షలు చేయించుకోనున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఉద్యోగులు, తమ విధుల్లో భాగంగా ఎంపీలతో సన్నిహితంగా మెలిగేవారు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని వెంకయ్య సూచించారు. కరోనా విజృంభన నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుల ఆరోగ్యమే ప్రాధాన్యంశంగా ఉన్నతాధికారులతో రాజ్యసభ చైర్మన్ ఇదివరకే సమావేశమై చర్చించారు. సభ్యుల మధ్య భౌతికదూరం పాటిస్తూ.. కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు వెంకయ్యనాయుడు.