Man Murdered For Property : ఉత్తరప్రదేశం రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ప్రాంతంలో ఆస్తిపై 52 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలి ప్రాంతానికి చెందిన భోజిపురా స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పది మంది భార్యలున్న అతడిని ఆస్తి కోసమే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భోజిపురాకు చెందిన జగన్లాల్ యాదవ్(52) అనే రైతు.. తమ పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొంది కోటీశ్వరుడు అయ్యాడు. పిల్లలు పుట్టకపోవడంతో పది మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. కాగా, ఇటీవల తన ఆ ఆస్తిని తన దత్తపుత్రుడికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం అతడి పొలంలోనే గొంతుకోసి, తలపై రాడ్తో కొట్టి చంపారు గుర్తు తెలియని దుండగులు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే. ప్రధాన రహదారికి సమీపంలో అతడికి భూములు ఉండటం వల్ల.. వాటిపై కన్నేసిన దుండగుల ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి, పిల్లలెవరూ లేరని పోలీసులు తెలిపారు. మొదటి భార్యకు చెందిన ఓ దత్తపుత్రుడు ఆ కుటుంబంతో ఉన్నట్లు వివరించారు.
జగన్లాల్కు 1990లో తొలి వివాహం జరిగింది. ఆ తర్వాత ఐదుగురు భార్యలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. మరో ముగ్గురు అతడ్ని వదిలేసి వెళ్లిపోయారు. హత్యకు ముందు వరకు పశ్చిమబెంగాల్కు చెందిన ఇద్దరు భార్యలతో ఉన్నట్లు సమాచారం.
భోజిపురా స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ.. హత్య సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం జగన్ లాల్ తలపై బలంగా కొట్టి.. గొంతు కోసి చంపినట్లు నిర్ధారించారు. అతని వైవాహిక జీవితం గురించి తమకు తెలియదని పోలీసులు తెలిపారు.
Read Also… కామారెడ్డి జిల్లాలో విషాదం.. భార్య అప్పులు చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ భర్త ఆత్మహత్య