గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ నేపథ్యంలో బ్యాలెట్పై స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. స్వస్తిక్ ముద్రతో పాటు పెన్ను గీత కానీ, ఇంక్ మార్క్ ఉన్నా కానీ ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వులను ఆక్షేపిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పెన్నుతో గీసినా ఓటేసినట్టే అనే సర్క్యూలర్పై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో బీజేపీ ఆరోపించింది. ఈ పిటీషన్పై హైకోర్టు మరికాసేపట్లో విచారించనున్నట్లు తెలుస్తోంది.