కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. నావెల్ కరోనా మహమ్మారితో పోరులో 95 మంది పోలీసులు, 46 మంది వైద్యసిబ్బంది మరణించారని చైనా అధికారికంగా వెల్లడించింది. శనివారం అక్కడ కొవిడ్-19 బాధితులు, మృతుల జాతీయ స్మారకం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు, వైద్య సిబ్బందిలో ఎందరు ప్రాణాలు కోల్పోయారో తొలిసారి ప్రకటించింది. హుబెయ్ ప్రావిన్స్ ప్రధాన నగరం వుహాన్లో కొవిడ్-19 మహమ్మారి గతేడాది చివర్లో తొలిసారి వెలుగుచూసింది.
కాగా.. కరోనావైరస్ కారణంగా శనివారం నాటికి 81,639 మందికి సోకగా 3,326 మంది మృతిచెందారని చైనా తెలిపింది. ప్రధాన పోలీసులు 60, సహాయ పోలీసులు 35 మంది కరోనా మహమ్మారి పోరులో ప్రాణత్యాగం చేశారని చైనీస్ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. మార్చి 15 నాటికి 46 మంది వైద్య సిబ్బంది కన్ను మూశారని పేర్కొంది. 3000కు పైగా వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకిందని గతంలో చైనా చెప్పిన సంగతి తెలిసిందే.