దేశం మొత్తం కరోనాతో చస్తుంటే జోగులంబ గద్వాల జిల్లాలో మాత్రం వింత సంఘటనతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే జోగుళాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన మంజుల(25) ఆరు సంవత్సరాల క్రితం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ తో వివాహం అయ్యింది.. అప్పటి నుండి ఆమె గర్భం దాల్చలేదు. గత ఏడాది గర్భం నిలబడడంతో ప్రతి నెల ఆశా వర్కర్ల సహాయంతో మానోపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు చేయించుకుంటూ వచ్చింది మంజుల. అయితే శనివారం రాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తనకు దేవుడు పూనాడంటూ వైద్య సేవలను నిరాకరించింది మంజుల. ఇది చూసిన డాక్టర్లు దిక్కుతోచని స్థితిలో వైద్యం అందించాలా, లేదా అన్న సందిగ్దంలో పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు మంజులను మళ్ళీ తీసుకువస్తామని చెప్పి ఆటోలో తీసుకెళ్లారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.. ఆమె ఇంటికి వెళ్లిన తరువాత ఎప్పటి మాదిరిగానే నిద్రపోయింది. ఉదయం లేచి చూసే సరికి ఆమె కడుపు ఖాళీగా మారిపోయింది. ఇదికాస్త ఊరి జనాలకు తెలియడంతో రాత్రికి రాత్రి కడుపులో పాప ఎక్కడ పోయిందని జనాలు బిక్క మొఖం వేశారు. మంజుల మాత్రం దేవుడు వచ్చి తన బిడ్డను తీసుకెళ్లాడని చెప్తోంది.
అసలు ఏమి జరిగింది
ఇరుగు పొరుగు వారితో పాటు కుటుంబ సభ్యులు కలసి అడగ్గా ఆమె మాత్రం తెల్లవారు జామున మౌలాలి స్వామి తన బిడ్డను తీసుకెళ్లాడని చెప్పుకొచ్చింది. అసలు ఆమె నిండు గర్భం ఎక్కడికి పోయింది… ఆమె కడుపులో ఉన్న శిశువు ఎలా మాయం అయ్యింది.. అర్థం కాకపోవడంతో హుటాహుటిన ఆమెను తీసుకోని కుటుంబ సభ్యులు మళ్ళీ మానోపాడు ఆసుపత్రికి ఆదివారం తీసుకెళ్లారు.
మంజులకు గర్భం దాల్చిన మాట వాస్తవమే… ఆశా వర్కర్
మంజుల గర్భం దాల్చిన మాట వాస్తవమేనని ఆమె చికిత్సం నిమిత్తం ప్రతినెల ఆసుపత్రిలో తీసుకొచ్చే ఆశా వర్కరు తెలిపారు. ఆమె గర్భంలో శిశువు ఉన్నమాట వాస్తవమేనని కాని ఒక్క రాత్రిలో గర్భం ఎలా మాయమైందో అర్థం కావడం లేదని వాపోయారు.
మంజులకు గర్భం ఉన్న మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు లేదు .. డాక్టర్ దివ్య
ఈ సంఘటన తెలుసుకున్న మండల వైధ్యాదికారిణి దివ్య హుటాహుటిన మనోపాడు ఆసుపత్రికి చేరుకొని మంజులను పరిశీలించారు. గత ఏడు నెలల క్రితం కడుపుతో ఉన్నప్పుడు పరీక్షలను తానే చేశానని..గర్భవతి అయిన విషయం వాస్తవమేనని వెల్లడించారు. కానీ ప్రజంట్ టెస్టులు చేస్తే ఆమె డెలివరీ అయ్యినట్లు, అబార్షన్ అయ్యినట్లు ఎలాంటి ఆధారాలు కనబడటం లేదన్నారు. స్కానింగ్ చేస్తే తప్ప పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.