‘‘కొన్నిసార్లు మంచి విషయాలు దూరమవుతాయి… మరికొన్ని సార్లు అంతకంటే మంచి విషయాలు దగ్గరవుతాయి..” అని శ్రీయ సిద్దనా గౌడర్ తన చేతి మార్పిడి అయిన ఒక సంవత్సరం తర్వాత నోట్ బుక్లో మొదటి వాక్యం రాశారు. ఈ రోజు, ఆమె చేతివ్రాత దాదాపుగా ఒరిజినల్తో సరిపోతుంది. కాని వైద్యులు ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏమిటంటే, ఒకప్పుడు కేరళకు చెందిన 20 ఏళ్ల వ్యక్తికి చెందిన చేతులు.. శ్రీయా స్కిన్ టోన్తో పూర్తిగా కలిసిపోవడం.
“మార్పు ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అవి ఇప్పుడు పూర్తిగా నా చేతులలాగే అనిపిస్తున్నాయి. చేతులు మార్పిడి తర్వాత చర్మం వాటి రంగు చాలా మారింది. అయినా ఆ విషయం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు వాటి రంగు..నా శరీర రంగులో కలిసిపోయింది ”అని ఆసియా యొక్క మొట్టమొదటి ఇంటర్-జెండర్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న 21 ఏళ్ల శ్రీయా చెప్పారు.
కొచ్చిలో ఆమె అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో డబుల్ హ్యాండ్ మార్పిడి చేయించుకుంది. మహిళా హార్మోన్లే ఆమె చేతుల రంగులో మార్పులకు కారణం అయి ఉండొచ్చని శస్త్రచికిత్స చేసిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 200 కంటే తక్కువ చేతి మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. వాటిలో స్కిన్ టోన్ లేదా చేతి ఆకారంలో మార్పులను నమోదు అయినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. బహుశా ఆ విషయంలో శ్రీయదే మొదటి కేసు అని వైద్యులు అంటున్నారు.
యాక్సిడెంట్ ఆమె జీవితంలో చీకట్లు నింపింది :
2016 సెప్టెంబర్లో శ్రీయ కర్నాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతోన్న సమయం. కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆమె ప్రయాణించిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్లో ఆమె రెండు చేతులూ చితికిపోవడంతో డాక్టర్లు వాటిని మోచేతి వరకు తొలగించారు. ఆ తర్వాత ఏడాదికి తర్వాత ఆమె హ్యాండ్ ట్రాన్స్ ప్లాంట్ కోసం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్మెడికల్ సైన్సెస్కు వెళ్లింది. డోనర్స్ ఎవరూ లేరని, ఒక ఏడాది వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని అక్కడి డాక్టర్లు చెప్పారు. కానీ అనూహ్యంగా వారు అలా చెప్పిన గంటకే ఎర్నాకుళానికి చెందిన సచిన్ అనే బీకాం స్టూడెంట్ బైక్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతడి ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరిచండతో సచిన్ చేతులను 2017 ఆగస్టు 9న సర్జరీ చేసి శ్రీయకు అమర్చారు. శ్రీయా రక్త నమూనాలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి రక్తంతో అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యమైంది.
13 గంటల పాటు జరిగిన ఈ సర్జరీలో 20 మంది సర్జన్లు, 16 మంది అనస్తీషియా టీం పాల్గొన్నారు. మొదట కొత్త చేతుల ఎముకలను శ్రీయా మోచేయి ఎముకలకు అతికించారు. తర్వాత నరాలు, రక్తనాళాలను కలిపారు. తర్వాత కండరాలను, చర్మాన్ని కూడా జతచేసి కుట్లు వేశారు. అనంతరం ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ చేయించుకోవడానికి ఏడాదిన్నర పాటు ఆమె కొచ్చిలోనే ఉండిపోయింది. అప్పట్నుంచి శ్రీయ బాడీ నుంచి కొత్త చేతులకు లింఫాటిక్ చానెల్ ఓపెన్ అయి, ఫ్లూయిడ్స్ సరఫరా అవడం ప్రారంభమైంది. మొదటి మార్పులలో ఒకటి.. చేతులు బరువు తగ్గడం. అదనపు కొవ్వు నెమ్మదిగా కరిగి ఆమె సన్నని ఎగువ శరీరానికి సరిపోయేలా మారింది. గత 3-4 నెలల్లో, శ్రేయా తల్లి సుమా తన కూతురి వేళ్లు సన్నగా, కొంచెం పొడవుగా మారడం గమనించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేతల్లో మూడు నరాలు, కొన్ని వేళ్ల కండరాలు మాత్రమే పూర్తిగా పనిచెయ్యడం లేదు. త్వరలోనే వాటిలో కూడా మార్పులు రావొచ్చని డాక్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేతులు తీసివేయడంతో ఇంజనీరింగ్ ఆపేసిన ఆమె..ఇప్పుడు ఇప్పుడు పుణేలోని పెర్గన్సన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదువుతోంది. ఇటీవల సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఆ తన కొత్త చేతులతోనే రాయడం విశేషం.
శ్రీయ ప్రస్తుత ఫోటో