సిరియాలో మళ్లీ ఉగ్రదాడి కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకుంటున్న వేళ.. ఆదివారం నాడు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఐఎస్ఐఎస్ ప్రభావిత ప్రాంతమైన సిరియాలో గతంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఉగ్రదాడులు జరుగుతుండేవి. అయిత గత కొద్ది రోజులుగా ఎలాంటి దాడులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మళ్లీ ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సిరియాలోని ఆఫ్రీన్ ప్రాంతంలో బాంబు దాడికి పాల్పడ్డారు. సిరియన్ నేషనల్ ఆర్మీ వాహనంలో ఐఈడీ బాంబు అమర్చి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆఫ్రీన్ జిల్లా కేంద్రంలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.