Alert: మీకు గాని ఇలాంటి కాల్స్ వచ్చాయా..? అస్సలు భయపడొద్దు.. ఏం చేయాలంటే..?

| Edited By: Ram Naramaneni

May 18, 2024 | 4:10 PM

కొన్ని సందర్భాల్లో మీ బంధువులు లేదా స్నేహితులు నేరం చేసి చిక్కారని.. వారు తమ అదుపులోని ఉన్నట్లు చెబుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసు క్లోజ్ చేయాలంటే డబ్బు పంపాలని డిమాండ్ చేస్తారు. వీరు లా ఏజెన్సీల అధికారులని మనల్ని నమ్మించేందుకు.. ప్రత్యేకంగా స్టూడియోలను తీసుకుని.. ప్రభుత్వ కార్యలయాల మాదిరి డెకరేట్ చేస్తారు.

Alert: మీకు గాని ఇలాంటి కాల్స్ వచ్చాయా..? అస్సలు భయపడొద్దు.. ఏం చేయాలంటే..?
Phone Call (Representative image)
Follow us on

”హాలో.. మేం చెన్నై క్రైం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో ఒక పార్శిల్‌ బుక్‌ అయింది. అందులో ఫేక్ పాస్‌పోర్టులు, డ్రగ్స్‌ ఉన్నాయి. అంతేకాదు, మీకు టెర్రరిస్ట్ మాస్టర్‌ మైండ్‌ అయిన అబూ సలీంతో పలు బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. మీరు అతని ఏజెంట్ అని మాకు సమాచారం ఉంది. చాలా పెద్ద కేసులో ఇరుక్కున్నారు.” అంటూ సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ బ్యూరో, కస్టమ్స్ అధికారులు పేరుతో ఫోన్లు వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ఏం కంగారు పడొద్దు. అవన్నీ ఫేక్ గాళ్ల కంత్రీ ప్లాన్స్. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్‌ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపిస్తూ కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు సైబర్ నేరగాళ్లు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఇలాంటి ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.

కొన్ని సందర్భాల్లో మీ బంధువులు లేదా స్నేహితులు నేరం చేసి చిక్కారని.. వారు తమ అదుపులోని ఉన్నట్లు చెబుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసు క్లోజ్ చేయాలంటే డబ్బు పంపాలని డిమాండ్ చేస్తారు. వీరు లా ఏజెన్సీల అధికారులని మనల్ని నమ్మించేందుకు.. ప్రత్యేకంగా స్టూడియోలను తీసుకుని.. ప్రభుత్వ కార్యలయాల మాదిరి డెకరేట్ చేస్తారు. ఆయా సంస్థల దుస్తులు ధరించి.. స్కైప్, ఇతర వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బాధితులతో లైవ్‌లో మాట్లాడతారు. దేశవ్యాప్తంగా అనేక మంది బాధితులు ఈ స్కామ్‌ల వల్ల గణనీయమైన మొత్తంలో డబ్బును కోల్పోయారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. I4C Microsoft సహకారంతో ఈ క్రైమ్స్‌లో పాల్గొన్న 1,000 స్కైప్ IDలను బ్లాక్ చేసింది. అంతేకాదు ఇది మోసగాళ్లు ఉపయోగించే SIM కార్డ్‌లు, మొబైల్ పరికరాలు, మ్యూల్ ఖాతాలను చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ తరహా కేసులను గుర్తించేందుకు, దర్యాప్తు చేయడం కోసం I4C రాష్ట్ర పోలీసు అధికారులకు ఇన్‌పుట్‌లతో పాటు సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తోంది.

I4C తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘సైబర్‌డోస్ట్’లో X, Facebook, Instagramలలో ఈ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోల ద్వారా వివిధ హెచ్చరికలను జారీ చేసింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీకు అలాంటి కాల్ వస్తే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి రిపోర్ట్ చేయాలని చెబుతున్నారు. లేదా సహాయం కోసం www.cybercrime.gov.inని సందర్శించమని సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..