Jallianwala Bagh: జలియన్‌వాలాబాగ్‌ మారణహోమానికి 102 ఏళ్లు…భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత విషాద దినం

|

Apr 13, 2021 | 6:10 AM

Jallianwala Bagh: జలియన్‌వాలాబాగ్‌ మారణ హోమానికి 102 ఏళ్లు పూర్తయింది. 1919 ఏప్రిల్‌ 13న భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత విషాద దినం. స్వాత్రంత్రోద్యమంలో.

Jallianwala Bagh: జలియన్‌వాలాబాగ్‌ మారణహోమానికి 102 ఏళ్లు...భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత విషాద దినం
Jallianwala Bagh
Follow us on

Jallianwala Bagh: జలియన్‌వాలాబాగ్‌ మారణ హోమానికి 102 ఏళ్లు పూర్తయింది. 1919 ఏప్రిల్‌ 13న భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత విషాద దినం. స్వాత్రంత్రోద్యమంలో జరిగిన అత్యంత దుదృష్టకరమైన, బ్రిటిష్‌ వారు చేపట్టిన అత్యంత పాశవికచర్య జలియన్‌ వాలాబాగ్‌ ఘటన. 1919 రౌలట్ చట్టం భారత పౌరులను ఎటువంటి విచారణ జరపకుండా శిక్షించే అధికారం అధికారులకు సంక్రమింపజేసింది. ఆనాడు ఆ చట్టాన్ని దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో హర్తాళ్ జరిగినప్పుడు ఉద్యమకారులు సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. అందుకు నిరసనగా జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల సంస్కరణార్థం, పోలీసుల చర్యలకు నిరసనగా అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం దగ్గర గల జలియన్‌వాలాబాగ్‌లో 1919 ఏప్రిల్‌ 13న ప్రజలు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిని నిషేధిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం చేసిన ప్రకటన తగినంతగా ప్రచారం కాలేదు. అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు శాంతియుతంగా జరుపుకొంటున్న సమావేశంపై ఒక్కసారిగా బ్రిటిష్‌ సైనికులు కాల్పుల వర్షం కురిపించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా పదినిమిషాల పాటు విచక్షణరహితంగా జరిపిన 1650 రౌండ్లు కాల్పులలో 379 మంది మరణించారని, 1200 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి వెయ్యి మంది వరకు చనిపోయి ఉంటారని, 2 వేలకుపైగా ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారని భావించారు.

మొదటి ప్రపంచ యుద్దం సమయంలో ఆంగ్లేయులకు భారతీయులు సహాయం చేశారు. ప్రధాన రాజకీయ నాయకత్వం నుంచి విశేషమైన స్పందన ఆంగ్లేయులకు లభించింది. ఆ విధంగా సహాయం చేయడం ద్వారా వారి నుంచి స్వాతంత్ర్యం పొందాలనేది భారతీయుల ప్రధానమైన ఆలోచన, కానీ బెంగాల్‌, పంజాబ్‌లలో మాత్రం వసలవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగాయి. దీంతో జలియాన్‌వాలా బాగ్‌ సమావేశం జరిగింది. వివిధ విభాగాలకు చెందిన 90 మంది బ్రిటిష్‌ సైనికులు కల్నల్‌ డయ్యర్‌ నాయకత్వంలో రెండు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. స్థలం ఇరుకుగా ఉండటంతో వాహనాలు పార్కు లోపలికి రాలేకపోయాయి. పంజాబ్‌లో నిత్యం జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి ఈ జలియన్‌వాలాబాగ్‌ దురంతం అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడైంది. 1920లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. భగత్‌సింగ్‌ విప్లవకారుడిగా మారేందుకు ఈ ఘటనే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికి నిరసనగా బ్రిటిష్‌ వారు తనకు ఇచ్చిన ‘సర్‌’ బిరుదును రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తిరిగి ఇచ్చేశారు. చాలా మంది దేశ భక్తులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ఘటన.. ఆగ్రహావేశాలతో ఉన్న అప్పటి యువతలో మరింత స్ఫూర్తిని రగిలింపజేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటట్లు చేయగలిగింది.

స్వాత్రంత్య సాధించుకునే వరకు అది కొనసాగింది. 1961 ఏప్రిల్‌ 13న జవహాల్‌ లాల్‌ నెహ్రు తదితరుల సమక్షంలో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ జలియన్‌వాలాబాగ్‌లో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. దానిపై నిరంతరాయంగా మండుతున్న ఆఖండజ్వాలను అని రాసి ఉంటుంది. పక్కనున్న భవనాలపై బుల్లెట్‌ గుర్తులను ఇప్పటికీ మనం ఆ ప్రాంతంలో చూడవచ్చు. బుల్లెట్‌ నుంచి తప్పించుకోవడానికి దూకి మరణించిన బావి కూడా స్మారకచిహ్నంగానే ఉంది. అక్కడ ఉన్న బావిలో నుంచి 120 శవాలను పైకి తీసినట్లు ఆ స్మారకచిహ్నంపై రాసి ఉండటం గమనార్హం. జనరల్ డయ్యర్ 1940 సంవత్సరాన లండన్‌లో విశ్రాంత జీవితాన్ని గడిపే సమయంలో భారత విప్లవకారుడు ‘ఉద్దంసింగ్’ చేతిలో హత్యకు గురయ్యాడు.

ఇవీ చదవండి: South Sudan Tribes Worship Cow: ఆ దేశంలోని ఆటవిక తెగవారు ఆవును పవిత్రమైన జంతువుగా పూజిస్తారు.. ఎందుకంటే..!

Snakes In Dreams: నిద్రలో పాములు కలలోకి వస్తున్నాయా..? వాటి ఫలితాలు ఏమిటో తెలుసా…?

Bhadra Maruti Temple: దేశంలో అరుదైన హనుమాన్ ఆలయం.. ఆయన్ని పెళ్లికాని వారు పూజిస్తే.. వెంటనే పెళ్లి..!