Tanikella Bharani: అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు నటుడు, రచయిత తనికెళ్ల భరణి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్కెఎం హోటల్లో నిర్వహించిన సింగర్ మీట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.
బాలుతో ‘మిథునం’ చిత్రం నిర్మించడం, అది ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. బాలు అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. కరోనా గురించి మాట్లాడుతూ.. ప్రపంచమంతా తనదే అనే దురహంకారులకు చెంపపెట్టు కరోనా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యం కాపాడకపోతే త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా నేర్పిందన్నారు. సాంకేతికత కారణంగా ఇంట్లో కూనిరాగాలు తీసేవారికి అరుదైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాదాపు 45 మంది గాయనీ, గాయకులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మధుర గీతాలను ఆలపించారు.