ప్రముఖ నిర్మాత, నటుడు రాక్లైన్ వెంకటేష్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వెంకటేష్ కుమారుడు అభిలాష్(డాక్టర్) ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కాగా ఆయనకు కరోనా సోకి ఉంటుందని కన్నడ పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. దివంగత నటుడు అంబరీష్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతతో కలిసి సీఎం యడ్యూరప్పను కలిశారు. ఇక ఇటీవలే సుమలతకు కరోనా నిర్ధారణ కాగా.. రాక్లైన్కి ఈ వైరస్ సోకి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రాక్లైన్ పలు చిత్రాలను నిర్మించారు. అలాగే కొన్ని సినిమాల్లో నటుడిగా కనిపించారు. ఇక ప్రస్తుతం కన్నడ సూపర్ స్టార్ దర్శన్తో రాజవీర మడకారి నాయక అనే పీరియాడికల్ డ్రామా చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రలోనూ ఆయన నటిస్తున్నారు.