విభిన్న పాత్రలను, సినిమాలను ఎంచుకోవడంలో గోపీచంద్ది ప్రత్యేకమైన శైలి. తాజాగా ఆయన స్పై థ్రిల్లర్ సబ్జెక్ట్ ‘చాణక్య’తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ…
యాక్షన్కి స్పై బ్యాక్డ్రాప్ జోడించడంతో సినిమాకి కొత్త ప్లేవర్ వచ్చింది. వినోదం, ఎమోషన్స్, ఉత్కంఠతకు గురిచేసే అంశాలకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఆ మూడూ పుష్కలంగా ఉన్నాయి. మాస్ అయినా క్లాస్ అయినా యాక్షన్ ఒక్కటే. ఇందులో అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దర్శకుడు తిరు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ముఖ్యంగా ఉత్కంఠతకి గురి చేసే అంశాలు బాగా నచ్చాయి. మనం చేసే సినిమాలు మనకు బాగా నచ్చుతాయి. అంతిమంగా నచ్చాల్సింది ఆడియెన్స్కి. ఇటీవల మాకు దగ్గరిగా ఉన్న కొంత మందికి సినిమా చూపించా. వారందరికీ బాగా నచ్చింది. దీంతో సినిమా ఫలితంపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సినిమా ఎలాంటి టర్న్ ఇస్తుందో తెలియదు కానీ కచ్చితంగా కెరీర్కి మాత్రం ప్లస్ అవుతుంది. అది తెరపైనే చూడాలి..
ఇందులో నేను రా ఏజెంట్ అర్జున్గా కనిపిస్తాను. నా పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. అర్జున్కి, రామకృష్ణకి ఉన్న సంబంధమేంటి?, రెండు షేడ్స్లో ఎందుకు కనిపిస్తాననేది తెరపై చూడాలి. చాణక్య అనే మిషన్ ప్రధానంగా సినిమా సాగుతుంది. మరి ఆ మిషనేంటో థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. నేను కూడా చాణక్య లాంటి ఇంటలిజెంట్గా కనిపిస్తాను. ఇందులో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్కి భిన్నంగా గెడ్డంతో కాస్త స్టయిలీష్గా చూపించాలని దర్శకుడు తిరు ప్రయత్నించారు. లుక్ బాగా వచ్చింది. సినిమాలో ఓ అరగంట హిలేరియస్ కామెడీ ఉంటుంది. ఆయా ఎపిసోడ్స్ చేసేటప్పుడు బాగా ఎంజారు చేశాను. నాకు సిగ్గు ఎక్కువ. హీరోయిన్లతోనే కాదు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేను. కానీ హీరోయిన్తో కెమిస్ట్రీ పండించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
సినిమా లాస్ట్ షెడ్యూల్ చివరి రోజు జెరూసలేంలో షూటింగ్ టైమ్లో బైక్ స్కిడ్ అయి గాయాలయ్యాయి. బాగా దెబ్బలు తగిలాయి. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. నిజానికి ఈ సినిమాని మేలోనే విడుదల చేయాలనుకున్నాం. యాక్సిడెంట్ కారణంగా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ ప్రారంభించాక దసరా పండక్కే రావాలని నిర్ణయించుకున్నాం. ‘సైరా’ కూడా ఇదే టైమ్లో వస్తుందని ఇటీవలే తెలిసింది. అయినా పండగ టైమ్లో రెండు మూడు సినిమాలకు స్కోప్ ఉంది. మంచి కంటెంట్ ఉండే ఏ సినిమా అయినా ఆడుతుంది. ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
ఇటీవల బహుభాషా చిత్రాలు వస్తున్నాయి. పాన్ ఇండియా సబ్జెక్ట్తో సినిమాలొస్తున్నాయి. ఇది మంచి పరిణామం. నిజానికి అన్ని భాషలకు గేట్స్ ఓపెనయ్యాయి. ఎవరు ఎలాంటి సినిమా అయినా చేయొచ్చు. అంతిమంగా సినిమా బాగుండాలి. దేనికైనా కథ ముఖ్యం. ఇప్పుడు కథకి ప్రాధాన్యత పెరిగింది. మంచి సినిమాలు ఆదరించేందుకు ఆడియెన్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్ర దర్శకుడు తిరు తమిళ దర్శకుడు అయినప్పటికీ సినిమాలో తమిళ ఛాయలేమీ కనిపించవు. నేను నలుగురు తమిళ దర్శకులతో పనిచేశాను. ఏ సినిమాకి అలాంటి సమస్య రాలేదు.