ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ల గురించి మాట్లాడారు. ఆచార్య తరువాత సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్లో నటించబోతున్నానని చిరు వివరించారు. ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్, సుకుమార్, హరీష్ శంకర్, పరుశురామ్ల దర్శకత్వంలో నటించబోతున్నాని ఆయన తెలిపారు. అయితే మెహర్ రమేష్తో మెగాస్టార్ సినిమాను ప్రకటించడంపై మెగా ఫ్యాన్స్ నుంచి కాస్త వ్యతిరేకత వచ్చింది. ఇంతవరకు ఆయన తెరకెక్కించిన సినిమాల్లో బిల్లా మినహా.. మిగిలిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన దర్శకత్వంలో సినిమా వద్దంటూ చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అయితే టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మెమర్ రమేష్ ఇంతవరకు చిరంజీవికి కథను చెప్పలేదట. కానీ కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం మెహర్ రమేష్ చేసిన కృషి చిరును మెప్పించిందట. దీంతో మెహర్కు బ్రేక్ ఇవ్వాలని భావించిన చిరు.. ఆయనకు ఆఫర్ ఇచ్చారట. అంతేకాదు మెహర్ విషయంలో కథ మొదలు బడ్జెట్ వరకు అన్ని చిరంజీవినే స్వయంగా చూసుకుంటున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మెహర్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా చిరంజీవికి దూరపు బంధువైన మెహర్ రమేష్కు అటు మహేష్ బాబుతోనూ మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే.
Read This Story Also: కరోనా కాటు…ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత