NTR: చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్‌ అందుకే స్పందించలేదు : రాజీవ్‌ కనకాల

|

Oct 12, 2023 | 8:23 PM

చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు మొదలు, ఇతర పార్టీలకు చెందిన వారు సైతం ఖండిస్తూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఒక్క వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాకవపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడే నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. గతంలో టీడీపీకి మద్ధతుగా ప్రచారం చేసిన జూనియర్‌ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు...

NTR: చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్‌ అందుకే స్పందించలేదు : రాజీవ్‌ కనకాల
Rajeev Kanakala, NTR
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎంతటి హాట్‌ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో అవనితీ జరిగిందన్న ఆరోపణలతో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులోనే ఉన్నారు. నెల దాటినా చంద్రబాబుకు బెయిల్‌ లభించకపోవడంతో టీడీపీ పోరు బాట పట్టింది. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబానికి చెందిన వారందరూ స్పందిస్తే ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే స్పందించలేదు. బహుశా ఈ విషయంపై ఎన్టీఆర్‌ స్పందించకపోవడానికి కారణం ఇదే అయ్యుంటందని నటుడు రాజీవ్‌ కనకాల తాజాగా స్పందించారు.

వివరాల్లోకి వెళితే.. చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోన్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు మొదలు, ఇతర పార్టీలకు చెందిన వారు సైతం ఖండిస్తూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఒక్క వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాకవపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడే నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. గతంలో టీడీపీకి మద్ధతుగా ప్రచారం చేసిన జూనియర్‌ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నందమూరి కుటుంబ సభ్యులంతా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించినా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం మౌనంగా ఉన్నారు. దీంతో పార్టీలో జూనియర్‌పై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్‌ స్పందించకపోవడంపై తాజాగా స్పందించిన బాలకృష్ణ.. సినిమా వాళ్లు స్పందించకపోవడంపై తాను పట్టించుకోనని, ఎన్టీఆర్‌ స్పందించకపోతే ఐ డోంట్‌ కేర్‌ అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. ఈ చర్చ ఇలా సాగుతున్న తరుణంలో ఇదే విషయమై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్నేహితుడు రాజీవ్‌ కనకాల స్పందించారు.

తాజాగా తన తనయుడి మూవీ లాంచింగ్ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై స్పందించారు. ఏపీలో జరుగుతోన్న వ్యవహారాలపై ఎన్టీఆర్‌ స్పందించకపోవడానికి వరుస సినిమాలతో తీరక లేకుండా ఉండడమే కారణం అయ్యింటందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ‘ట్రిపులార్‌ సినిమా, మధ్యలో కరోనా ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ కనీసం నాలుగు సినిమాలు చేసేవారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపైనే ప్రస్తుతం జూనియర్‌ దృష్టిసారించారు. పూర్తి సమయాన్ని సినిమాకే కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన దృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టాలని భావించి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను’ అని రాజీవ్‌ కనకాల చెప్పుకొచ్చారు.

ఇక తాను రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారన్న ప్రశ్నకు బదులిచ్చిన రాజీవ్‌.. తాను రాజకీయాలకు సమయం కేటాయించాగలనని అనుకున్నప్పుడు కచ్చితంగా వస్తానని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లోకి రావాలంటే అధ్యయనం చేయాలన్నారు. అవేవీ చేయకుండా రాజకీయాలు మొదలు పెట్టడం కుదరదన్న రాజీవ్‌ కనకాల.. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని, వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని బదులిచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..