ఏజెన్సీలో పేలిన నాటు తుపాకీ..గిరిజన యువకుడు మృతి

|

Oct 17, 2020 | 4:34 PM

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలంలో నాటుతుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో సుమారు 24 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జరిగిన ఘటనతో ఏజెన్సీ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. పరిసర పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు పోలీసులు.

ఏజెన్సీలో పేలిన నాటు తుపాకీ..గిరిజన యువకుడు మృతి
Follow us on

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తుంటారు. మరికొన్ని సమయాల్లో కొందరు తుపాకులతో వేటాడుతుంటారు. నాటు తుపాకులతో అడవి జంతువుల కోసం వేటాడే క్రమంలో జరిపిన కాల్పుల్లో స్థానిక గిరిజన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం గదబగలుగులో నాటు తుపాకీ కాల్పులకు బలరాం అనే గిరిజన యువకుడు మృతిచెందాడు. వన్యప్రాణుల వేటకోసం 20 మంది గిరిజనులు వెళ్లి కొండపై గుంపులుగా విడిపోయారు. అయితే, అడవి పంది నెపంతో..ఓ బృందం కాల్పులు జరపడంతో అక్కడే ఉన్న మరో గ్రూప్‌కు చెందిన బలరాం అనే గిరిజనుడు బుల్లెటు్ల తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట సాగిస్తున్న వారిపై ఆరా తీశారు. వారంతా ఎంతకాలం నుండి వేటసాగిస్తున్నారనే విషయాలను తెలుసుకున్నారు. మరోవైపు గిరిజన యువకులకు నాటు తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై కూడా ఆరా తీయటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గిరిజనులకు పలు సూచనలు చేశారు. నాటు తుపాకులు వినియోగించడం నేరమంటున్న అధికారులు..ఒకవేళ ఎవరిదగ్గరైనా నాటు తుపాకులుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లలో వాటిని డిపాజిట్ చేయాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ ఘటనలో మరణించిన బలరాం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు.