పసిపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. పిల్లలు అబద్ధాలు చెప్పరనడానికి మరో ఉదాహణ గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. తల్లిని గొంతు నులిమి చంపిన తండ్రిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు 8 ఏళ్ల బాలుడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిజాన్ని కక్కించారు.
భార్యాభర్తల మధ్య ఇళ్లలో జరిగే చిన్నపాటి గొడవలు కొన్నిసార్లు విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. ఇలాంటి ఘటన ఒకటి గుజరాత్లోని సూరత్లో వెలుగు చూసింది. స్వల్ప వివాదం కారణంగా భర్త తన భార్యను గొంతు నొక్కి హత్యచేశాడు. ఈ విషయాన్ని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు.
సూరత్ నగరంలోని నీలం పార్క్ సొసైటీలో రసిక్ భాయ్(40). ఆతను భార్య హంస, 8 సంవత్సరాల కుమారుడు తనయ్తో పాటు కలిసి ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య కుటుంబ విషయమై గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రసిక్ భాయ్ తన భార్య హంసను గొంతు నొక్కి హత్యచేశాడు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆ దంపతుల 8 సంవత్సరాల కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు.
తరువాత హంస ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించేందుకు నిందితుడు ఆమె మృతదేహాన్ని ఇంట్లో వేలాడదీశాడు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, హంస మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. తరువాత పోలీసులు రసిక్ను విచారిస్తుండగా, అతని కుమారుడు తన తల్లిని తండ్రే హత్య చేశాడని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీశారు. ఫలితంగా రసిక్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని సూరత్ పోలీసు పీఆర్ పీఎల్ చౌదరి తెలిపారు.