తెలంగాణలో పవిత్ర గోదావరి కలుషితమవుతోంది. దక్షిణ గంగా కాలకూట విషంగా మారుతోంది. నది స్వచ్ఛతను కాపాడాల్సింది పోయి అందులోకి కాలకూటాన్ని వదులుతున్నారు. వరద నీటితో పాటు ఎగువనున్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను సైతం గోదావరిలోకి వదలటంతో బాసర వద్ద గోదావరి జలాలు పూర్తిగా కలుషితమై..రంగుమారి దర్శనమిస్తోంది.
నిర్మల్ జిల్లాలో గోదావరిలో కలుస్తున్న విషజలాలతో రంగు మారి ప్రమాదకరంగా కనిపిస్తోంది. తాజాగా గోదావరి నదిలో బాసర వద్ద మహారాష్ట్రలోని ఓ ఆల్కాహల్ ఫ్యాక్టరీ నుండి కలుస్తున్న విష జలాలతో నది నీరు ఎర్రగా మారి ప్రమాదకరంగా కనిపిస్తోంది. బాసర సరిహద్దు ప్రాంతమైన ధర్మాబాద్ నుండి గోదావరిలోకి ఆల్కాహల్ ఫ్యాక్టరీ నుండి విడుదలవుతున్న జలాలు కలవడంతోనే రంగుమారి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు బాసర శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవడం అదే సమయంలో బాసర చెంత గోదావరి ఎరుపెక్కి కనిపిస్తుండటంతో పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. నురగలు కక్కుతూ ప్రవహిస్తున్న జీవనది గోదావరిని చూసి ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, ఆయకట్టు రైతులు ఈ నీటితో పంటలు సాగు చేస్తే పంటలు సరిగా పండక పోవచ్చని, దిగుబడి రాకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రసాయనాలు గోదావరిలో కలవకుండా చూడాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఆల్కాహాలిక్ వ్యర్థాలతో ఎస్సారెస్పీ నుండి 30 కిలో మీటర్ల వరలు ఈ విషజలాలు పారుతున్నట్టు సమాచారం.