Krishna Murder: హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మరుగుజ్జు వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువులో పడేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం పండ్లవెల్లి గ్రామానికి చెందిన కృష్ణ కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో ఉంటున్నాడు.
అయితే మరుగుజ్జు అయిన కృష్ణ స్థానికంగా ట్యూషన్లు చెబుతుంటాడు. ఖాళీ సమయంలో పూల వ్యాపారం చేస్తుంటాడు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే అనుకోకుండా హత్య కావడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. కూకట్పల్లి నల్లచెరువులో ప్లాస్టిక్ కవర్లో స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కవర్ విప్పడంతో స్థానికులు మృతదేహం కృష్ణదిగా గుర్తించారు. మృతుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించాయి. కృష్ణను అతడి ఇంటి వద్దనే హత్య చేసి కవర్లో మూటకట్టి చెరువులో పారవేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హతుడికి ఎవరితో గొడవలు లేవని, హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియటం లేదని మృతుడి తండ్రి ఆంజనేయులు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.