ఎన్కౌంటర్లో మృతి చెందిన దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలు 50శాతం కుళ్లిపోయాయి. ప్రత్యేక పద్ధతిలో ఈ నిందితుల మృతదేహాలను భద్రపరిచినప్పటికీ.. మరో వారం రోజుల్లో ఇవి పూర్తిగా డీకంపోజ్ అవ్వనున్నాయని గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్ శ్రావణ్ అన్నారు. మృతదేహాల భద్రత విషయంలో శ్రావణ్, కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ నలుగురి మృతదేహాలను భద్రపరిచేందుకు వేరే అవకాశమేమైనా ఉందా..? అని కోర్టు శ్రావణ్ను అడిగింది. అలాగే దేశంలో ఇతర ఆసుపత్రుల్లోనైనా భద్రపరచడానికి అవకాశం ఉందా..? అని ప్రశ్నించింది. ఈ విషయాలకు శ్రావణ్ తెలియదని చెప్పారు.
అయితే ఈ నెల 6న చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితులు మరణించారు. ఇక ఆ రోజే ఈ నలుగురి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. అయితే ఎన్కౌంటర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఎన్హెచ్ఆర్సీ విచారణ చేయడం, సుప్రీం కోర్టులోనూ దీనిపై పిటిషన్ దాఖలు అవ్వడం.. ఇలా వరుసగా జరిగాయి. ఇక ఎన్కౌంటర్పై ఇంకా హైకోర్టు నుంచి తీర్పు రాకపోవడంతో నిందితుల అంత్యక్రియలు ఇంతవరకు జరగలేదు.
ఇక తాజాగా ఈ కేసుపై విచారించిన హైకోర్టు.. నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 23న సాయంత్రం 5గం.లలోపు రీపోస్ట్మార్టం చేయాలని.. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసి, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్ను సీల్డ్ కవర్లో భద్రపరచాలని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని నిపుణులతో రీపోస్ట్మార్టం నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఎన్కౌంటర్కు సంబంధించిన అన్ని ఆధారాలు, బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్, పోస్ట్మార్టం రిపోర్టులను భద్రపరచాలని న్యాయస్థానం తెలిపింది. రీపోస్ట్మార్టం పూర్తి తరువాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని పేర్కొంది. ఇక ఈ మృతదేహాల అంత్యక్రియలు కూడా అప్పుడే జరిగే అవకాశం ఉంది.