పెళ్లి కార్డుల్లో అక్రమంగా ఎఫెడ్రిన్ అనే మత్తు మందును తరలిస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు ఓ స్మగ్లర్. మొత్తం 43 పెళ్లి పత్రికల్లో.. 5.43కేజీల డ్రగ్స్ను రహస్యంగా ఉంచి కార్గో పార్సిస్ సర్వీస్ ద్వారా బెంగళూరు నుంచి ఆస్ట్రేలియా తరలించే ప్రయత్నం చేశాడు. పెళ్లి కార్డ్స్పై అనుమానం వచ్చిన బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్ కస్టమ్ అధికారులు.. వాటిని తీసి చూసే ప్రయత్నం చేశారు. ఎవరికి అనుమానం రాకుండా.. పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్ ప్యాకెట్లను చూసి షాక్ అయ్యారు అధికారులు. అయితే ఈ డ్రగ్స్ను మధురైకి చెందిన ఓ వ్యక్తి తరలిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో 5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్ను రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం 10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.