హైదరాబాద్లో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో చాలా చోట్ల రోడ్లన్నీ నదులను తలపించాయి. అనేక ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ఉధృతికి వాహనాలు సైతం నీళ్లలో కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే అఫ్జల్ గంజ్ సమీపంలోని పురానాపూల్ బ్రిడ్జి వద్ద మొసలి కలకలం రేపింది.
వరద ప్రవాహానికి నదిలో నుంచి ఒడ్డుకు వచ్చిన మొసలి చాలా సేపు కదలకుండా ఉండిపోయింది. మొసలిని చూసిన స్థానికులు భయపడిపోయారు. వెంటనే పోలీసులు, జంతు ప్రదర్శనశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జూ సిబ్బంది పురానాపూల్ వంతెన వద్దకు చేరుకొని మొసలిని పట్టుకొని తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే అది నీటిలోకి వెళ్లిపోయింది.