Vizianagaram DSP Juttu Paparao Dies of Coronavirus : విజయనగరం సిసిఎస్ డిఎస్పిగా పనిచేస్తోన్న జుత్తు పాపారావు కోవిడ్ వైరస్ బారినపడి ప్రాణాలొదిలారు. విశాఖపట్నం శ్రద్ధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన భార్య కూడా శ్రద్ధ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పిల్లలు కేర్ హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. 1991 బ్యాచ్ ఎసై గా పోలీస్ డిపార్ట్ మెంట్లో విధులలో చేరిన జుత్తు పాపారావు.. విశాఖలో ఎస్సైగా, సిఐ గా వివిధ స్టేషన్స్ లో పనిచేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎసిపి గా విధులు నిర్వర్తించారు. కాగా, మరోవైపు, బెజవాడలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 493 మందికి కరోనా పాజిటివ్ వస్తే అందులో 60 శాతానికి పైగా ఒక్క బెజవాడలోనే నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. నగరంలో సత్యనారాయణపురం, భవానిపురం, పటమట, గుణదల ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు కోవిడ్ టెస్టులు పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. నగరంలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కేసులు అధికంగా నమోదవుతున్నాయంటున్నారు నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్.